
కోరుట్ల, వెలుగు: కోరుట్ల ప్రభుత్వ వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. గురువారం కోరుట్లలోని అల్లమయ్యగుట్టలోని అగ్రికల్చర్ కాలేజీని ఎమ్మెల్యే సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కాలేజీలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. విద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.
కులమతాలను రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారా
మెట్పల్లి, వెలుగు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులమతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలని కుట్రలు చేశారని, ఇది సరైన పద్ధతి కాదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
గురువారం పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 233 పోలింగ్స్టేషన్ లో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటీలో ఉన్న పార్టీలు పట్టభద్రుల కోసం ఏం చేశారో చెప్పకుండా కులమతాల పేరుతో విభేదాలు సృష్టించేలా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.